Peddi: మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (Peddi)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. ఈ నిర్ణయం సినిమాపై ఉన్న క్రేజ్ను మరింత పెంచింది. టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి లభించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రతి టికెట్పై రూ.100 వరకు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్లలో ప్రతి టికెట్పై రూ.125 వరకు పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే విధంగా ప్రత్యేక ప్రీమియర్ షో టికెట్ ధరను గరిష్టంగా రూ.600గా నిర్ణయించారు.
షోల విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రోజుకు 4 షోలు మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉండగా, ‘పెద్ది’ సినిమాకు ప్రత్యేకంగా రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో చిత్ర నిర్మాతలు మరియు బయ్యర్లకు భారీ ఊరట లభించినట్లయింది. విడుదలకు ముందే సినిమా బిజినెస్ పరంగా మరింత బలం పొందినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.








