YS Sharmila vs Pawankalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తప్పుబట్టారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు విభేదాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని ఆమె ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడడం తగదని, వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్(Pawankalyan) వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని జనసేన స్పష్టం చేసినా, వివాదం కొనసాగుతూనే ఉంది. కోనసీమ కొబ్బరిపై తెలంగాణ ప్రజల దిష్టి ఉందంటూ మాట్లాడటం బాధాకరమని షర్మిల పేర్కొన్నారు.
ALSO READ:Virat Kohli Century | కింగ్ కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు
ప్రాంతీయ విబేధాలను ప్రేరేపించేలా వ్యవహరించడం ఉప ముఖ్యమంత్రికి తగదని ఆమె అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పక్కనబెట్టి మూఢ నమ్మకాలపై నిందలు వేయడం సరికాదని విమర్శించారు.
శంకరగుప్తం పరిసర ప్రాంతాల్లో డ్రెయిన్ నిర్మాణాలు, గట్ల బలోపేతం, ఉప్పునీటి ప్రవేశం నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందనే అంశాలను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టాలని ఆమె సూచించారు.
కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కనీసం రూ. 3,500 కోట్ల నిధులను కేటాయించి, తక్షణ చర్యలు చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేయడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
