Tirumala laddu: తిరుమల శ్రీవారి దర్శనం ఎంత పవిత్రమో, స్వామివారి ప్రసాదమైన లడ్డూ కూడా అంతే ప్రత్యేకమైనది. తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదం విక్రయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో లడ్డూ అమ్మకాలు గణనీయంగా పెరిగి భారీ ఆదాయం సమకూరింది.
టీటీడీ గణాంకాల ప్రకారం, 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులకు విక్రయించారు.
గత ఆర్థిక సంవత్సరం 2024–25లో ఈ సంఖ్య 12,18,53,535గా ఉండగా, ఈ ఏడాది దాదాపు 1.76 కోట్ల లడ్డూల అదనపు విక్రయాలు నమోదయ్యాయి. ఈ అమ్మకాల ద్వారా సుమారు రూ.567 కోట్ల ఆదాయం టీటీడీకి వచ్చినట్లు సమాచారం.
భక్తుల రద్దీ పెరుగుతుండటంతో టీటీడీ రోజుకు సగటున నాలుగు లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. తిరుమల దర్శనం పొందే ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తుండగా, అదనంగా కావాలనుకునే భక్తులకు ఒక్కో లడ్డూ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు.
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుండటంతో లడ్డూ ప్రసాదం డిమాండ్ కూడా రికార్డు స్థాయికి చేరుతోంది. దీంతో టీటీడీ ప్రసాదం తయారీ, సరఫరా వ్యవస్థను మరింత విస్తరించాల్సిన అవసరం ఏర్పడుతోంది.








