Stock Market Today: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నేటి ట్రేడింగ్ సెషన్లో దాదాపు స్థిరంగా ముగిశాయి. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ ఒప్పందంపై సానుకూల అంచనాలతో గత మూడు రోజులు లాభాల్లో కొనసాగిన మార్కెట్, ఈ రోజు మాత్రం పరిమిత శ్రేణిలోనే కదలాడింది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలపై స్వల్ప ప్రభావం కనిపించింది.
బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 84,339.15 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో 84,081.25 నుంచి 84,487.34 పాయింట్ల మధ్య ఊగిసలాడిన సూచీ, చివరకు 40.28 పాయింట్ల నష్టంతో 84,233.64 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ స్వల్ప లాభంతో 18.70 పాయింట్లు పెరిగి 25,953.85 వద్ద స్థిరపడింది.
రూపాయి డాలర్తో పోలిస్తే 90.70 స్థాయిలో కొనసాగింది. రంగాల పరంగా చూస్తే ఐటీ షేర్లలో అమ్మకాలు అధికంగా కనిపించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎటెర్నెల్ వంటి షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే ఎస్బీఐ, మారుతీ సుజుకీ, ఇండిగో, ట్రెంట్, రిలయన్స్ వంటి షేర్లు లాభాలను ఆర్జించాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 69.71 డాలర్ల స్థాయిలో కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 5070 డాలర్లకు చేరువలో ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సంకేతాలు, వివిధ రంగాల్లో కనిపించిన మిశ్రమ ప్రదర్శన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ముగిసింది.








