Nayara Energy: దేశంలో ఇంధన కొరత భయాలు నెలకొన్న వేళ, పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెరుగుదల ప్రజల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో పెట్రోల్ దొరక్క వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా, భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ ధరలను భారీగా పెంచడం సంచలనంగా మారింది.
ఈ నిర్ణయంతో పెట్రోల్ ధర లీటరుకు గరిష్టంగా రూ.5.30 వరకు, డీజిల్ ధర రూ.3 వరకు పెరిగినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా సరఫరా అంతరాయం ఏర్పడవచ్చనే ప్రచారం, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే భయం కారణంగా ప్రజలు పెట్రోల్ బంకుల వద్దకు పోటెత్తుతున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో బంకుల వద్ద భారీ క్యూలు, ట్రాఫిక్ జామ్లు కనిపిస్తున్నాయి.
కొందరు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. కేవలం వాహన ఇంధనమే కాకుండా, వంటగ్యాస్ కోసం కూడా డిపోల బయట ప్రజలు క్యూల్లో నిలుస్తున్నారు.
ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం, ఇంధన క్షేత్రాలపై దాడులు జరగడం వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నట్లు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో, ప్రైవేట్ ఇంధన సంస్థలు నష్టాలను తగ్గించుకునేందుకు వినియోగదారులపై ధరల భారాన్ని మోపుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఇంధన మార్కెట్ పరిస్థితులపై మరింత ఆందోళన నెలకొంది.








