Ap Assembly: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను కాంగ్రెస్ బాధ్యతాయుతంగా నిర్వహించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన ఏపీ అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ జరిగిన చర్చలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో ఒకసారి చంద్రబాబును కలిసిన విషయాన్ని గుర్తుచేసిన పవన్, అప్పట్లో “టెంట్ వేసుకునైనా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేద్దాం” అని చంద్రబాబు చెప్పిన మాటలు తనను బలంగా ప్రభావితం చేశాయని అన్నారు.
అందుకే 2014లో ఎలాంటి షరతులు లేకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని, అనుభవజ్ఞుడైన నాయకత్వం రాష్ట్రానికి అవసరమని అప్పుడే భావించానని తెలిపారు.
రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ చేయడం సాధారణ విషయం కాదని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతులు ఎలాంటి పెద్ద గొడవలు లేకుండా భూములు ఇవ్వడం గొప్ప విషయమని పవన్ పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగిందని కూడా ఆయన అన్నారు.
2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై అనేక అభండాలు వేసారని, గత పాలనలో మహిళా రైతులను సైతం దారుణంగా కొట్టారని పవన్ ఆరోపించారు. ఇంటి నుంచి బయటకు రాని మహిళలు కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
అప్పటి పాలనలో ఎప్పుడూ యుద్ధ వాతావరణమే కనిపించేదని, చట్టసభల్లో కూడా దాడులు జరిగేవని వ్యాఖ్యానించారు.
రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ రాజధాని అంశంపైనే పోరాడాల్సి వస్తోందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్ర వేర్వేరు అనే భావన తమకు ఎప్పుడూ లేదని, “తెలుగు నేల” అనే భావన మాత్రమే ఉందని అన్నారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు సరైన కార్యాలయాలు కూడా లేని పరిస్థితుల్లో చంద్రబాబు ఆశావాదంతో పనిచేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు.








