ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రముఖ రైడ్-హైలింగ్ యాప్స్ వినియోగించే ప్రయాణికులకు భారీ షాక్ తగలనుంది. ఫిబ్రవరి 7న దేశవ్యాప్తంగా రైడ్-హైలింగ్ డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించకపోవడం, ఛార్జీల విధానం అన్యాయంగా ఉండటం, ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ సమ్మె చేపట్టినట్లు డ్రైవర్స్ సంఘాలు వెల్లడించాయి.
ఈ సమ్మె ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ఓలా, ఉబర్, ర్యాపిడో క్యాబ్ సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఆఫీస్ వెళ్లే వారు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
డ్రైవర్ల ప్రధాన డిమాండ్లలో కనీస బేస్ ఛార్జీలు ఖరారు చేయడం, వేతనాల్లో పారదర్శకత తీసుకురావడం, ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆదాయం పెంచడం, అనవసర ఐడీ బ్లాక్లను నిలిపివేయడం, భద్రతా బీమా కల్పించడం ఉన్నాయి.
డ్రైవర్ల ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడిపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా ఈ దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు డ్రైవర్ యూనియన్లు స్పష్టం చేశాయి.
