Iran Saudi Conflict: గత నెల 28న ప్రారంభమైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు తాజాగా కీలక మలుపు తీశాయి. ఇప్పటి వరకు ప్రధానంగా అమెరికా స్థావరాలపై దాడులు జరిపిన ఇరాన్, ఇప్పుడు గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలపై లక్ష్యంగా దాడులు ప్రారంభించింది.
ముఖ్యంగా సౌదీ అరేబియాకు చెందిన ఆరాంకో రిఫైనరీలపై జరిగిన దాడులు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. దీంతో సౌదీ తొలిసారిగా ఇరాన్కు గట్టిగా హెచ్చరిక జారీ చేసింది. తమ సహనానికి హద్దు ఉందని, దీన్ని బలహీనతగా భావించవద్దని స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యలకు దిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉదయం గ్యాస్, ఆయిల్ మౌలిక వసతులపై జరిగిన దాడులు గల్ఫ్ దేశాల్లో ఆందోళన కలిగించాయి.
సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ మాట్లాడుతూ, ఇరాన్ చర్యలు బ్లాక్మెయిల్ ప్రయత్నాలని మండిపడ్డారు. అవసరమైతే తమ సామర్థ్యాన్ని ఉపయోగించి ప్రతిస్పందించడానికి వెనుకాడమని హెచ్చరించారు.
రియాద్ వైపు ప్రయోగించిన నాలుగు బాలిస్టిక్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నట్లు సౌదీ వెల్లడించింది. ఈ దాడులు ప్రాంతీయ సమావేశాన్ని భయపెట్టే ప్రయత్నంగా భావిస్తున్నట్లు పేర్కొంది.
ఇరాన్ ప్రత్యక్షంగా, ప్రాక్సీల ద్వారా శత్రు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించిన సౌదీ, వెంటనే వ్యూహాన్ని మార్చుకోవాలని కోరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇరాన్ దాడులతో ఖతార్, కువైట్, సౌదీకి చెందిన చమురు, గ్యాస్ కేంద్రాలు ప్రభావితమవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.










