LPG Gas Cylinder: దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పంపిణీ ప్రక్రియను మరింత బలోపేతం చేసినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం గ్యాస్ బుకింగ్లలో సుమారు 96 శాతం ఆన్లైన్ ద్వారానే జరుగుతుండటం వల్ల పారదర్శకత పెరిగిందని అధికారులు తెలిపారు. అదే సమయంలో సరైన వ్యక్తికే సిలిండర్ అందేలా ఓటీపీ ఆధారిత డెలివరీ విధానంను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఇక చిన్న సిలిండర్లకు ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోంది. ముఖ్యంగా 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లకు డిమాండ్ పెరుగుతూ ఉండటం గమనార్హం. తక్కువ పరిమాణంలో, సులభంగా ఉపయోగించుకునే ఈ సిలిండర్లను సామాన్యులు, చిన్న వ్యాపారులు ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
మరోవైపు, ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ (png) కనెక్షన్ల విస్తరణకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. సంప్రదాయ సిలిండర్ల స్థానంలో పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అందించడం వల్ల వినియోగదారులకు మరింత సౌకర్యం, ఖర్చులో కొంత ఆదా లభిస్తోంది.
అలాగే పర్యావరణ హితమైన కాంప్రెస్డ్ బయోగ్యాస్ (cbg) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తోంది. మొత్తం మీద, దేశంలో ఇంధన సరఫరా వ్యవస్థ బలంగా ఉందని, ఎల్పీజీ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది.








