Hanuman Jayanti: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
భక్తికి, అపారమైన శక్తికి ప్రతీక అయిన శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఇంటా సుఖశాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఆంజనేయుడి మహిమ కేవలం బలంలోనే కాకుండా, జ్ఞానం, వినయం, నిస్వార్థ సేవలోనూ ప్రతిఫలిస్తుందని కేసీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి యొక్క అపారమైన జ్ఞానాన్ని, అచంచల భక్తిని, ధర్మపట్ల ఆయనకున్న నిబద్ధతను కేసీఆర్ స్మరించారు.
సంత్ తులసీదాస్ తన రామచరిత మానస్లో హనుమంతుడిని “జ్ఞానినాం అగ్రగణ్యం” గా పేర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తూ, జ్ఞానులందరిలోనూ అత్యున్నత స్థానం ఆంజనేయుడిదేనని అన్నారు.
శ్రీ ఆంజనేయ స్వామి కేవలం బలశాలి మాత్రమే కాదని, వినయం, మృదుస్వభావం, సేవాభావానికి ఆయనే అసలైన మార్గదర్శి అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ధర్మరక్షణ కోసం శ్రీరాముని సేవలో తన శక్తినంతా అర్పించి, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజాహితం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తిత్వం స్వామి వారిదని కొనియాడారు.
ఆంజనేయ స్వామి చూపిన నిస్వార్థ సేవ, అంకితభావం, పట్టుదల ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని, సమాజ హితం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
హనుమాన్ జయంతి సందర్బంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఆనందం, ఆధ్యాత్మిక శాంతి కలగాలని ఆయన ఆకాంక్షించారు.








