పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ తక్షణమే సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారతదేశం, పాకిస్థాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ద్వారా తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్లపై భారత్కు పూర్తి హక్కులు లభించగా, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్లపై పాకిస్థాన్కు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. భారత్ ఈ నదుల్లో జలవిద్యుత్, వ్యవసాయం వంటి పరిమిత వినియోగానికి మాత్రమే హక్కులుంటాయి. అయితే ఇప్పుడు ఇది తాత్కాలికంగా నిలిపివేయబడింది.
ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్ మీద తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి నీటి కొరత తలెత్తే అవకాశం ఉంది. సింధు, జీలం, చీనాబ్ నదులపై పాక్ అధికంగా ఆధారపడుతోంది. ఈ ప్రవాహాలు నిలిచిపోతే ఆహార భద్రతపై పెనుముప్పు తలెత్తుతుంది. అలాగే, జలవిద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగడం వల్ల విద్యుత్ కొరత ఏర్పడుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టి, పేద ప్రజల జీవనోపాధిని ముప్పు పెట్టే ప్రమాదం ఉంది.
ఇక పశ్చిమ నదులపై భారత్ నిర్మించిన ప్రాజెక్టులపై పాకిస్థాన్ అభ్యంతరాలు ఎత్తే అవకాశం తక్కువగా మారుతుంది. కిషన్గంగ వంటి ప్రాజెక్టులలో రిజర్వాయర్ నిర్వహణలో ఉన్న పరిమితులు తొలగిపోతాయి. నదుల ఫ్లషింగ్, నిల్వ షెడ్యూల్ వంటి నిబంధనలు వర్తించవు. పాకిస్థాన్ బృందాల తనిఖీలు కూడా ఆగిపోవచ్చు. ఇది భారతదేశానికి నీటి వినియోగంలో పూర్తి స్వాతంత్ర్యం కల్పించడంతోపాటు, వరద నియంత్రణలో ఉపయోగపడుతుంది.
ఇరు దేశాల మధ్య గతంలో ఎన్ని ఉద్రిక్తతలున్నా, సింధు ఒప్పందం మౌలికంగా కొనసాగుతూనే వచ్చింది. ఇప్పుడు భారత్ ఏకపక్షంగా దాన్ని నిలిపివేయడం, పాక్ను అంతర్జాతీయ వేదికల్లోకి తీసుకెళ్లే అవకాశాలను తెరలేపుతుంది. ప్రపంచ బ్యాంకు జోక్యం, అంతర్జాతీయ చట్టాల ప్రకారం వివాద పరిష్కారం వంటి దిశగా వెళ్లవచ్చు. ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత సంక్లిష్టం చేసే అవకాశముంది.








