India Child Mortality: శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించడంలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మార్టాలిటీ ఎస్టిమేషన్ (UNIGME) 2025 నివేదిక ప్రకారం, నవజాత శిశువులు మరియు ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించడంలో భారత్ గత రెండు దశాబ్దాలుగా నిరంతర కృషి చేస్తోంది.
1990తో పోలిస్తే ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 76 శాతం తగ్గగా, 2000తో పోలిస్తే 68 శాతం తగ్గుదల నమోదైంది. 2000లో ప్రతి 1,000 సజీవ జననాలకు 92గా ఉన్న మరణాల రేటు, 2024 నాటికి 32కు పడిపోవడం విశేషం.
ఈ విజయానికి ప్రధాన కారణంగా ప్రభుత్వ ఆరోగ్య పథకాలు నిలిచాయి. ముఖ్యంగా సార్వత్రిక టీకా కార్యక్రమం (UIP), గర్భిణీలకు ఆసుపత్రి ప్రసవాల ప్రోత్సాహం, ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాల (SNCU) ఏర్పాటు వంటి చర్యలు కీలకంగా మారాయి.
నిమోనియా, డయేరియా, మలేరియా వంటి వ్యాధులను అరికట్టడంలో భారత్ వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. ఆరోగ్య మౌలిక సదుపాయాల మెరుగుదల వల్ల లక్షలాది చిన్నారుల ప్రాణాలు రక్షించబడ్డాయి.
ఇదే విధంగా చర్యలు కొనసాగితే భవిష్యత్తులో శిశు మరణాల రేటు మరింత తగ్గే అవకాశముందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది.







