ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా, సీఎం చంద్రబాబు రెండో రోజు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో అనేక ప్రముఖ కంపెనీల అధిపతులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ రోజు, 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో, గ్రీన్ హైడ్రోజన్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాల వంటి అంశాలపై చర్చ జరగనుంది.
సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఆర్థిక మంత్రితో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు. వీరితో ఆర్థిక, పెట్టుబడుల అంశాలను చర్చించేందుకు అవకాషం ఉంటుందనే అభిప్రాయం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వ్యాపార ప్రముఖులు కూడా సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. వీరిలో, వెల్స్పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈఓ షిన్ హక్ చియోల్, కార్ల్స్బెర్గ్ సీఈఓ జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, సిస్కో సీఈఓ చుక్ రాబిన్స్ తదితరులు ఉండవచ్చని తెలుస్తోంది.
