నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలిచి సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజు దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు కేయాన్ష్ అడ్విక్ ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-2’ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు.
గత 21 నెలలుగా ఈ వ్యాధితో పోరాడుతున్న చిన్నారికి బెంగళూరులోని బాపిస్ట్ హాస్పిటల్ (Baptist Hospital- వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ వ్యాధికి అవసరమైన AVXS-101 (Onasemnogene Abeparvovec) అనే ఇంజెక్షన్ ధర సుమారు రూ.16 కోట్లు. ఒక్కసారి మాత్రమే ఇవ్వాల్సిన ఈ ఔషధం భారత్లో అందుబాటులో లేకపోవడం కుటుంబానికి మరింత భారంగా మారింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులు ఈ భారీ ఖర్చును భరించలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయం తెలిసిన బాలకృష్ణ, తన వంతు సహాయం అందించడంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా సహకారం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సమాజం ముందుకు రావాలని, ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో ముందుకు వస్తే ఈ చిన్నారి జీవితాన్ని రక్షించవచ్చని ఆయన పిలుపునిచ్చారు.








