Assam Bjp Manifesto: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 31 హామీలతో రూపొందించిన ఈ ప్రకటనలో మహిళలకు నెలకు రూ.3వేలు అందజేయడం, ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.
ఈ మ్యానిఫెస్టోను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు కలిసి విడుదల చేశారు.
మ్యానిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా ‘అరుణోదయ’ పథకం కింద ప్రతి నెల రూ.3వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే ‘లఖ్పతి దీదీ’ పథకం ద్వారా 40 లక్షల మంది మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించారు. మహిళా ఓటర్లను ఆకర్షించేలా ఈ హామీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టమవుతోంది.
అదేవిధంగా, అస్సాం రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని, అయితే రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ పరిధిలోని గిరిజన ప్రాంతాలు, ఎస్టీ ప్రాంతాలకు మినహాయింపు ఉంటుందని భాజపా తెలిపింది. రాష్ట్రాన్ని వరదల నుంచి రక్షించేందుకు దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది.
భూముల ఆక్రమణ సమస్యపై కూడా పార్టీ దృష్టి పెట్టింది. ముఖ్యంగా బంగ్లాదేశీ మియాలు ఆక్రమించుకున్నట్లు ఆరోపిస్తున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది.
ఇక యువత కోసం ఐదేళ్లలో 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని భాజపా హామీ ఇచ్చింది.
అస్సాంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా మ్యానిఫెస్టో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.








