Ajit Pawar Funeral: మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటుచేసుకున్న వేళ అజిత్ పవార్(Ajit Pawar) అంత్యక్రియల్లో దుర్ఘటన వెలుగు చూసింది. విమాన ప్రమాదంలో మరణించిన మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు నివాళులర్పించేందుకు జనవరి 29న బారామతిలో వేలాది మంది తరలివచ్చారు. ఈ అపూర్వ జనసందోహాన్ని ఆసరాగా చేసుకున్న దొంగల ముఠా భారీ దోపిడీకి పాల్పడింది.
అంత్యక్రియల సమయంలో సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.
టెక్నికల్ ఆధారాలు, గూఢచారి సమాచారం ఆధారంగా ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజ్కుమార్ బాబూరావు, మొహమ్మద్ అనీస్, ఐజాజ్ మిరావాలే సహా ఏడుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు రంజిత్ జాదవ్, విశ్వజిత్ తుపే తదితరుల మెడలోని బంగారు గొలుసులు, జేబుల్లోని నగదును ఈ ముఠా అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, అజిత్ పవార్కు నివాళిగా మహిళల కోసం ప్రారంభించిన ‘ముఖ్యమంత్రి లాడ్కీ బహిన్ యోజన’ పేరును మార్చాలన్న డిమాండ్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిట్కరీ స్పందిస్తూ, ఈ పథకానికి ‘అజిత్ దాదాంచి లాడ్కీ బహిన్’ అని పేరు పెట్టాలని సూచించారు.
అజిత్ పవార్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 2024 జూలైలో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు ₹1,500 అందిస్తున్నారు.
