కాకినాడ జిల్లా గండేపల్లి మండలానికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ ఎదుర్కొంటున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది. ఈ ఘటన నియోజకవర్గంలో కలకలం రేపింది. బాధితురాలు తనకు సరిగా తిండిపెట్టలేదని, చంపేసేలా ఉన్నారని, తనను కాపాడి పిల్లల వద్దకు చేర్చాలని కన్నీటి పర్యంతమై చెప్పింది.
గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారికి 19 ఏళ్ల క్రితం జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వెంకటేశ్తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త మృతితో కుటుంబ భారం తనపై పడడంతో, బతుకుతెరువు కోసం గారా కుమారి కువైట్ వెళ్లాలని నిర్ణయించుకుంది. ఏజెంట్ సాయంతో కువైట్ చేరి, అక్కడి ఇం ట్లో పని చేస్తున్న ఆమె ఏడు నెలల కాలంలో తీవ్ర చిత్రహింసలకు గురైంది.