Deputy Cm Pawankalyan: ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని అమలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం, ఈ రోజు నుంచే చేనేత రంగానికి ఉచిత విద్యుత్ పథకం అమలులోకి తీసుకువస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఈ పథకం ద్వారా ప్రతి చేనేత మగ్గానికి 200 యూనిట్లు, ప్రతి పవర్ లూమ్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 93 వేల చేనేత మగ్గాలు, అలాగే 11,488 పవర్ లూమ్ యూనిట్లు నేరుగా లబ్ధి పొందనున్నాయని చెప్పారు.
ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడం, ముడిసరుకు ధరలు అధికం కావడం, మార్కెట్లో పోటీ పెరగడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నేతన్నలకు ఈ పథకం కొంత ఊరటనిస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చిన్నచిన్న చేనేత కుటుంబాలకు ఇది ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.
2017లో నేతన్నలు తనను కలిసి వారి కష్టాలు వివరించిన సందర్భాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో వారి జీవన పరిస్థితులు తనను ఎంతో కలచివేశాయని చెప్పారు.
అప్పటి నుంచి చేనేత కార్మికులకు అండగా నిలవాలని సంకల్పించి, తానే స్వయంగా చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు వచ్చానన్నారు. వారంలో కనీసం ఒకరోజైనా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని ఇచ్చిన పిలుపు యువతలో మంచి చైతన్యం తీసుకొచ్చిందని తెలిపారు.
అలాగే నివార్ తుపాను సమయంలో వెంకటగిరి ప్రాంతంలో చేనేత మగ్గాలు దెబ్బతిన్నప్పుడు అక్కడికి వెళ్లి నేతన్నలను పరామర్శించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు ఉచిత విద్యుత్ పథకం అమలులోకి రావడం ద్వారా చేనేత రంగానికి మరింత బలం చేకూరుతుందని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తోందని, ఈ పథకం ద్వారా లబ్ధి పొందబోయే ప్రతి చేనేత కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.








