New Zealand Women: మహిళా వన్డే క్రికెట్లో న్యూజిలాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు భారత మహిళల జట్టు పేరిట ఉన్న అత్యధిక లక్ష్య ఛేదన రికార్డును కివీస్ చెరిపేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 347 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ మహిళలు 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసి ఛేదించాయి.
దీంతో మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక విజయవంతమైన రన్చేజ్గా నమోదైంది. అంతకుముందు భారత్, న్యూజిలాండ్పైనే 341 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ ఘనత కివీస్ ఖాతాలోకి వెళ్లింది.
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 346/6 స్కోరు చేసి బలమైన స్థితిలో నిలిచింది. దీంతో సిరీస్ను సొంతం చేసుకునే అవకాశాలు సఫారీలవైపు కనిపించాయి. కానీ, న్యూజిలాండ్ అద్భుత పోరాటంతో మ్యాచ్ను తారుమారు చేసింది.
ఈ విజయానికి కెప్టెన్ అమెలియా కెర్ ప్రధాన కారణంగా నిలిచింది. ఆమె కేవలం 139 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సర్తో అజేయంగా 179 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది.
ఆమెకు ఇసాబెల్లా గేజ్ 68 పరుగులతో అద్భుత సహకారం అందించింది. మధ్యలో కొన్ని వికెట్లు త్వరగా కోల్పోయినా అమెలియా కెర్ ఒత్తిడిని తట్టుకుని చివరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేసింది.
ఈ అసాధారణ ఇన్నింగ్స్కు ఆమె ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. కివీస్ విజయం సాధించడంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ 1-1తో సమమైంది. దీంతో నిర్ణయాత్మక ఆఖరి పోరు ఏప్రిల్ 4న ఆసక్తికరంగా మారింది.








