Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వసంత ఋతువు ఆరంభాన్ని సూచించే ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలుగులోనే సందేశాన్ని అందిస్తూ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
మోదీ తన సందేశంలో ఉగాది పండుగకు ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరించారు. వసంత కాలంలో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుందని, పూల పరిమళాలు, పండ్ల సమృద్ధి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని తెలిపారు. ఈ పండుగ మన జీవితాల్లో సానుకూలతను తీసుకువచ్చే సమయమని చెప్పారు.
అలాగే రైతుల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, కొత్త వ్యవసాయ చక్రాన్ని ఆశాభావంతో ప్రారంభించే సమయం ఇదేనని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో రైతుల కృషి కీలకమని గుర్తు చేశారు.
ఉగాది పచ్చడి ద్వారా తీపి, చేదు అనుభవాలను సమానంగా స్వీకరించాలనే జీవన సూత్రాన్ని మన సంస్కృతి తెలియజేస్తుందని అన్నారు.
జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని ధైర్యంగా అంగీకరించడం వల్ల మనలో సాహసం పెరుగుతుందని, సవాళ్లను అధిగమించే శక్తి పెరుగుతుందని మోదీ పేర్కొన్నారు. విజయాలను కృతజ్ఞతతో స్వీకరించాలని, అపజయాలను పాఠాలుగా తీసుకోవాలని సూచించారు.
ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం నింపాలని, శాంతి, సానుకూలత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.









