LPG Gas Cylinder: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత వస్తుందనే వదంతుల మధ్య కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ(LPG) సరఫరా పూర్తిగా స్థిరంగా కొనసాగుతోందని, వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశీయ రిఫైనరీల నుంచి గ్యాస్ ఉత్పత్తి సుమారు 38 శాతం మేర పెరిగింది. ఇది వినియోగదారుల అవసరాలను సమర్థంగా తీర్చడంలో కీలకంగా మారింది. డిజిటల్ సేవల విస్తరణతో గ్యాస్ బుకింగ్ వ్యవస్థలో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సుమారు 94 శాతం బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. దీని వల్ల పారదర్శకత పెరగడంతో పాటు వినియోగదారులకు సులభతరం అయింది.
సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు ‘డెలివరీ ఆథెంటికేషన్ కోడ్’ (DAC) విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. డెలివరీ సమయంలో ఓటీపీ విధానం తప్పనిసరి చేయడంతో నిజమైన లబ్ధిదారులకే సిలిండర్లు అందుతున్నాయి. ఈ విధానం వినియోగం ఇప్పటికే 76 శాతానికి పెరిగింది.
అక్రమాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 12,000కు పైగా దాడులు నిర్వహించి, 15,000కుపైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
వినియోగదారులు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని కేంద్రం సూచించింది. గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నాయని, బుకింగ్ చేసిన తర్వాత తక్కువ సమయంలోనే డెలివరీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. భవిష్యత్తులో కూడా సరఫరాలో ఎటువంటి అంతరాయం రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.







