Rajya Sabha: రాజకీయాల్లో ఫుల్స్టాప్ అనే మాట ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభలో 59 మంది సభ్యులు రిటైర్ అవుతున్న సందర్భంలో ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా రిటైర్ అవుతున్న సభ్యులకు వీడ్కోలు పలుకుతూ, వారి సేవలను ప్రశంసించారు. పార్లమెంట్ను ఓ ఓపెన్ యూనివర్సిటీగా అభివర్ణించిన మోదీ, ఇక్కడ ప్రతి ఒక్కరూ నిరంతరం నేర్చుకుంటూ దేశానికి సేవ చేయాలని సూచించారు.
రిటైర్ అయిన తర్వాత కూడా ప్రజాసేవ ఆగిపోదని, దేశ నిర్మాణంలో వారి అనుభవం ఎంతో అవసరమని ప్రధాని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని, భవిష్యత్తు అందరికీ తెరవబడినదే అని అన్నారు. ఫేర్వెల్ వంటి సందర్భాల్లో రాజకీయ భేదాలు కరిగిపోతాయని, అందరిలో ఒకే భావోద్వేగం నెలకొంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, ఎన్సీపీ నేత శరద్ పవార్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. వారు తమ జీవితంలో పెద్ద భాగాన్ని పార్లమెంట్కు అంకితం చేశారని, వారి క్రమశిక్షణ, అంకితభావం కొత్త ఎంపీలకు ఆదర్శమని అన్నారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మృదుస్వభావి అని, కానీ పనిలో అత్యంత కట్టుబాటుగా ఉంటారని పేర్కొన్నారు.
అలాగే, పార్లమెంట్ వ్యవస్థలో రెండు సభల పాత్ర ఎంతో ముఖ్యమని ప్రధాని చెప్పారు. ఒక చట్టం ఆమోదం పొందేందుకు రెండో అభిప్రాయం అవసరమని, ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని వివరించారు. ఈ విధానం వల్ల నిర్ణయాలు మరింత సమగ్రంగా, సమర్థవంతంగా మారుతాయని తెలిపారు.








