Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు రెండేళ్లకు చేరుకున్నప్పటికీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ఇంకా పూర్తికాకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తును వేగవంతం చేసి వాస్తవాలు బయటపెట్టి దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, సిట్ విచారణలో నిజంగా ఏం జరిగిందో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడిస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని, దర్యాప్తుకు అందరూ పూర్తి స్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా సిట్ విచారణపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని కవిత స్పష్టం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలకన్నా చట్టపరమైన ప్రక్రియలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుంట నక్కలతో కలిసి రాజకీయ డ్రామాలు ఆడుతోందని ఆమె ఆరోపించారు.
తన ఫోన్తో పాటు తన భర్త ఫోన్ కూడా ట్యాప్ అయ్యాయనే అనుమానాలు ఉన్నాయని కవిత వెల్లడించారు. ఈ కేసులో సిట్ అధికారులు విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరై పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు బయటపడాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ALSO READ:Oracle Layoffs | ఏఐ ఎఫెక్ట్.. ఒరాకిల్లో భారీ లేఆఫ్స్?







