భారతదేశం నవంబర్ నెలలో పసిడి దిగుమతుల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. ఈ నెలలో పసిడి దిగుమతులు 14.8 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో వాణిజ్య ఎగుమతులు తగ్గుముఖం పడగా, దిగుమతులు పెరిగాయి. 2023 నవంబర్ నెలతో పోలిస్తే, ఈ ఏడాది నవంబర్ నెలలో ఎగుమతులు 4.85 శాతం క్షీణించాయి.
గత ఏడాది నవంబర్ నెలలో 33.75 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉండగా, ఈ ఏడాది నవంబర్ నెలలో ఆ ఎగుమతులు 32.11 బిలియన్ డాలర్లకు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం తాజా వాణిజ్య గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాలు అనుసారం, నవంబర్ నెలలో దిగుమతులు 69.95 బిలియన్ డాలర్లుగా పెరిగాయి, ఇది 27 శాతం వృద్ధిని సూచిస్తోంది.
ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం కారణంగా వాణిజ్య లోటు 37.84 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 2.17 శాతం పెరిగి 284.31 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 8.35 శాతం పెరిగి 486.73 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.