పార్వతీపురం ఐటిడిఏ పీవోకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన నాయకులు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల ఖర్చుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వెలుగు ఏపీడీ సత్యం నాయుడు హయాంలో జరిగిన ఖర్చులను పరిశీలించాలని వారు కోరారు.
వివిధ మండలాలకు సరఫరా చేసిన యంత్రాలు, సామగ్రి, ఇతర కొనుగోళ్లలో ఏమైనా అక్రమాలు జరిగాయా అనే విషయంపై ప్రభుత్వం సత్వర విచారణ చేపట్టాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. చింతపండు మరియు ఇతర వస్తువుల కొనుగోలు వివరాలను బహిరంగంగా వెల్లడించాలని వారు కోరారు.
ఈ విచారణకు సంబంధించి తక్షణమే చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని గిరిజన సంఘ నాయకులు రామారావు, రామస్వామి హెచ్చరించారు. పారదర్శకంగా దర్యాప్తు జరిపి నిజాలను వెలుగులోకి తేవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని గిరిజన సంఘాలు స్పష్టం చేశాయి.
గ్రీవెన్స్ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు, వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు సంబంధించిన నిధులను ఎవరు దుర్వినియోగం చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతూ సంఘం సభ్యులు ఐటిడిఏ పీవోకు వినతిపత్రం అందజేశారు.








