Telangana Railway Projects: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో రైల్వే నెట్వర్క్ మరింత విస్తరించనుందని ఆయన తెలిపారు.
ఇప్పటికే ఈ లైన్లకు సంబంధించి డీపీఆర్ తయారీ కోసం సర్వేలు కొనసాగుతున్నాయని, అవి పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. 2022–23 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 18 కొత్త రైల్వే లైన్లకు అనుమతి ఇచ్చామని, మొత్తం 57 రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్ సర్వే మంజూరైందన్నారు.
వీటిలో భాగంగా 5,665 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు నిర్మించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం 2,343 హెక్టార్ల భూమి అవసరమవుతుందని, అయితే భూసేకరణలో జాప్యం కారణంగా నాలుగు ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 1,580 హెక్టార్ల భూమిని సేకరించినట్లు చెప్పారు.
కాచిగూడ–జగ్గయ్యపేట (250 కి.మీ), పటాన్ చెర్వు–ఆదిలాబాద్ (320 కి.మీ), వికారాబాద్–కృష్ణా (122 కి.మీ), గద్వాల్–డోర్నకల్ (316 కి.మీ), బోధన్–లాతూర్ (128 కి.మీ), అక్కన్నపేట బైపాస్ (128 కి.మీ) వంటి కీలక రైల్వే లైన్లు ప్రతిపాదనలో ఉన్నాయని తెలిపారు. ఇవి తెలంగాణ అభివృద్ధికి కీలకంగా మారనున్నాయి.
