S Janaki Son Death: సినీ రంగంలో వరుస విషాదాలు కలచివేస్తున నేపథ్యంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది ప్రముఖ గాయని ఎస్. జానకి కుమారుడు మురళీకృష్ణ (65) కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లు జానకి గారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీకృష్ణ పరిస్థితి ఇటీవల తీవ్రంగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ఈ వార్త సినీ, సంగీత వర్గాలను తీవ్రంగా కలచివేసింది.
మురళీకృష్ణ మరణ విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ ఘటన తనను తీవ్రంగా షాక్కు గురి చేసిందని ఆమె భావోద్వేగంగా పోస్టు చేశారు.
మురళీకృష్ణ భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా, నటుడిగా కూడా కొన్ని చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. కళలకు పేరుగాంచిన కుటుంబంలో జన్మించిన ఆయన, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
మురళీకృష్ణకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, సంగీత ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ, ఎస్. జానకి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
