Visakhapatnam railway station: విశాఖలో రైల్వే స్టేషన్ లో భద్రతను మరింత పటిష్టం చేయాలనే ధ్యేయంతో విశాఖపట్టణం రైల్వే స్టేషన్లో తొలిసారిగా ‘రోబో కాప్’ను(AI ROBO) సేవల్లోకి తీసుకొచ్చారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఐజీ అలోక్ బోహ్రా, డీఆర్ఎం లలిత్ బోహ్రా ఈ రోబోను అధికారికంగా ప్రారంభించారు.
కృత్రిమ మేధస్సు (AI), ఐఓటీ (IoT) ఆధారిత ఆధునిక సాంకేతికతలతో రూపొందించిన ఈ రోబో స్టేషన్ పరిసరాల్లో నిరంతరం గస్తీ నిర్వహించగలదు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, తరచూ దొంగతనాలకు పాల్పడే వారి ఫొటోలను సేకరించి విశ్లేషించడం ద్వారా రైల్వే పోలీసులకు ఇది కీలకంగా సహకరిస్తుంది.
అలాగే, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేయడం, భద్రతా చర్యలపై అప్రమత్తత కల్పించడం వంటి బాధ్యతలను కూడా ఈ రోబో నిర్వహిస్తుంది. విశాఖకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఈ రోబోను తయారు చేయగా, రైల్వే పోలీసులు దీనికి ‘ఏఎస్సీ అర్జున్’ అనే పేరు పెట్టారు.
ఈ కార్యక్రమంలో డివిజినల్ సెక్యూరిటీ కమాండెంట్ ఏకేదుబేతో పాటు ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఇతర ప్రధాన స్టేషన్లలో కూడా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ALSO READ:USA Immigration | ఐదేళ్ల చిన్నారిని నిర్బంధించిన అధికారులు







