Rajnath Singh: నేటి ప్రపంచంలో యుద్ధం అనేది కేవలం సరిహద్దుల వద్ద జరిగే సైనిక ఘర్షణకే పరిమితం కాదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆధునిక యుద్ధ స్వరూపం పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహార భద్రతలు కూడా జాతీయ రక్షణలో అంతర్భాగమయ్యాయని ఆయన అన్నారు.
ఒక దేశం మరో దేశాన్ని బలహీనపర్చేందుకు ఇప్పుడు ఈ రంగాలనే ఆయుధాలుగా ఉపయోగించే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. అందుకే సైన్యంతో పాటు ప్రతి పౌరుడు కూడా దేశ రక్షణ పట్ల అప్రమత్తంగా, సన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉత్తరాఖండ్లోని ఒక సైనిక పాఠశాల ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశ భద్రతను బలోపేతం చేయడానికి ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా ఆయుధ సంపత్తి, సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నామని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సాయుధ దళాలకు అధునాతన, స్వదేశీ రక్షణ సామగ్రి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
యువత దేశ సేవలో భాగస్వాములు కావాలని, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. సైన్యం బలంగా ఉండటం మాత్రమే కాదు, పౌర సమాజం కూడా దృఢంగా ఉన్నప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని అన్నారు.
యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్సీసీ ప్రవేశాల సామర్థ్యాన్ని 17 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రజా-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాలో దేశవ్యాప్తంగా 100 కొత్త సైనిక పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సైనిక పాఠశాలల్లో బాలికల ప్రవేశం పెరగడం ‘నారీ శక్తి’ బలోపేతానికి చారిత్రాత్మక అడుగుగా ఆయన అభివర్ణించారు. బాలికా క్యాడెట్లు భవిష్యత్లో వివిధ రంగాల్లో నాయకులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.







