రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని చెత్త నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించి, వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ విధానాలను తెలుసుకున్నారు. చెత్త సేకరణ కోసం కొత్త వాహనాలను ప్రారంభించి స్వయంగా నడిపారు. గ్రామ స్థాయిలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్’ నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ స్థాయిలో చెత్తను సమర్థవంతంగా నిర్వహించి సంపదగా మారుస్తున్న విధానాలను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు.
నంబూరులోని చెత్త నిర్వహణ కేంద్రంలో పవన్ కళ్యాణ్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తడి, పొడి, విషపూరిత వ్యర్థాల విభజన విధానాలను పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్, వర్మి కంపోస్ట్ తయారీ పద్ధతులను అవగతం చేసుకున్నారు. సంపద సృష్టి కేంద్రాలలో పండించిన పళ్లు, కూరగాయల ప్రదర్శనను తిలకించారు.
అంతేకాదు, ఇటీవల విజయవాడ వరదల్లో పనిచేసిన 35 మంది పారిశుద్ధ్య కార్మికులను పవన్ కళ్యాణ్ సత్కరించారు. వారికి శాలువా కప్పి, కొత్త వస్త్రాలు, పండ్లు అందజేశారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించి వారి సేవలను ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.




