Padma Awards 2026 Sports List: భారతదేశంలోని అత్యున్నత పౌర గౌరవాలైన పద్మ అవార్డులను 2026(Padma Awards 2026) సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కళలు, క్రీడలు, సాహిత్యం, విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ వంటి విభాగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులు అందజేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించడం ఆనవాయితీ.
2026 ఏడాదికి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించారు. ఇందులో పద్మ విభూషణ్ 5, పద్మ భూషణ్ 13, పద్మశ్రీ 113 మందికి ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది క్రీడారంగానికి చెందిన ప్రముఖులకు పెద్ద ఎత్తున గుర్తింపు లభించడం విశేషం.
భారత మాజీ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్లకు ‘పద్మశ్రీ’ అవార్డులు ప్రకటించారు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ T20 వరల్డ్ కప్ 2024, చాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకోవడం ఆయన కెరీర్కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.
అలాగే భారత మహిళా క్రికెట్కు కొత్త దిశ చూపిన హర్మన్ప్రీత్ కౌర్ కూడా పద్మశ్రీ అందుకున్నారు. ఆమె నాయకత్వంలో భారత మహిళా జట్టు చారిత్రాత్మక విజయాలు సాధించింది. ఇక భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్ రాజ్కు ‘పద్మ భూషణ్’ ప్రకటించారు.
భారత మహిళా హాకీ గోల్కీపర్ సవితా పునియాకు పద్మశ్రీ లభించగా, భారత రెజ్లింగ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన జార్జియన్ కోచ్ వ్లాదిమిర్ మెస్ట్విరిష్విలికి మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.
also read:Telangana Police Medals 2026: గణతంత్ర దినోత్సవానికి 23 మందికి పురస్కారాలు







