Onion Prices: ఒకప్పుడు కిలో ఉల్లిపాయ ధర వంద రూపాయలు దాటిన రోజులు కనిపించాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా తారుమారైంది. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ ధరలు ఒక్కసారిగా క్షీణించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గల్ప్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఎగుమతుల మందగమనం, దేశీయ మార్కెట్లలో పెరిగిన సరఫరా ఉల్లిపాయ ధరలను దిగజార్చాయి. ఫలితంగా వినియోగదారులకు చౌకగా ఉల్లి దొరుకుతున్నా, రైతులకు మాత్రం ఇది తీవ్ర నష్టంగా మారింది.
ప్రస్తుతం కొన్ని మార్కెట్లలో రూ.100కే సుమారు 8 కిలోల ఉల్లిపాయలు లభిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నెల రోజుల క్రితం క్వింటా ఉల్లి ధర రూ.2,000 వరకు ఉండగా, ఇప్పుడు అది రూ.800 నుంచి రూ.1,400 మధ్యకు పడిపోయింది.
పంటను పండించడానికి పెట్టిన ఖర్చులు, కూలీలు, రవాణా చార్జీలు కూడా తిరిగి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు మార్కెట్కు తీసుకెళ్లిన ఉల్లిపాయలను అమ్మకుండా రోడ్ల పక్కనే వదిలేసి వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇక టమాటా రైతుల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. మార్కెట్లో నిల్వలు పెరగడంతో కిలో టమాటా రూ.10కే అమ్ముడవుతోంది. దీంతో టమాటా సాగు చేసిన రైతులు మరింత నష్టాల్లోకి జారుతున్నారు. కొంతమంది రైతులు పంటను కోయడానికే ఆసక్తి చూపకుండా, పశువులకు మేతగా వేయడం లేదా రోడ్ల పక్కనే పారబోసేయడం వంటి దుస్థితి నెలకొంది.
వ్యవసాయ మార్కెట్లలో ఈ సంక్షోభం కొనసాగుతుండటంతో, ఉల్లి, టమాటా రైతులకు తక్షణ ఉపశమన చర్యలు అవసరం అని రైతు సంఘాలు చెబుతున్నాయి. కనీస మద్దతు ధర లేకపోవడం, మార్కెట్లో స్థిరత్వం లేకపోవడం వల్ల రైతుల పెట్టుబడులు నీటిలో కలిసిపోతున్నాయి.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణ, కొనుగోలు కేంద్రాలు, రవాణా సబ్సిడీ వంటి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.








