Nashik Car Accident: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. డిండోరి ప్రాంతంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కుటుంబ సభ్యులు ఒక వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోతైన బావిలోకి దూసుకెళ్లింది. కారు బావిలో పడిపోవడంతో అందులో ఉన్నవారంతా అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు క్రేన్లు, గజ ఈతగాళ్ల సహాయంతో కారును బావి నుంచి బయటకు తీశారు.
అనంతరం మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురు పెద్దలతో పాటు ఆరుగురు చిన్నారులు మృ**తి చెందడం మరింత విషాదాన్ని మిగిల్చింది.
మృతుల్లో సునీల్ దత్తాత్రేయ దర్గోడ్, ఆయన భార్య రేష్మా, ఆశా అనిల్ దర్గోడ్ ఉన్నారు. వీరితో పాటు 7 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గల ఆరుగురు చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇంతమంది ఒకేసారి మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కారు అదుపుతప్పడానికి గల అసలు కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలచివేసింది.








