చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల హాస్టల్లో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆదేశాల మేరకు ఈ శిబిరం ఏర్పాటు చేశారు. మండల వైద్యాధికారి సాయి సింధు నేతృత్వంలో 50 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు.
పరీక్షల సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చలికాలం కారణంగా విద్యార్థుల వద్ద తలెత్తిన దురద సమస్యకు ప్రత్యేక మందులు అందించారు. హాస్టల్ వంటగదిని పరిశీలించి వంటసామాగ్రి నిర్వహణపై వంట సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి జిల్లా వైద్యశాఖ నుండి మరిన్ని సూచనలు అమలు చేస్తామని సాయి సింధు తెలిపారు. మంచి ఆహారం, శుభ్రమైన వాతావరణం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గీత, డాక్టర్ హరీష్, సిహెచ్ఓ యాదగిరిరావు, హెల్త్ సూపర్వైజర్ బుజ్జి, ల్యాబ్ టెక్నీషియన్ నర్సింలు, ఏఎన్ఎంలు కవిత, నాగలక్ష్మి, ఆశ వర్కర్లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.