సంక్షోభంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్న హీరో మహేశ్ బాబు, తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న విషయం తెలిసిందే. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ మహేష్ తన దాతృత్వాన్ని నిరూపించుకుంటున్నారు.
తాజాగా మహేశ్ బాబు ఫౌండేషన్ మరోసారి మానవతా భావంతో ముందుకొచ్చింది. వరలక్ష్మి (2 నెలలు), పూజ్యశ్రీ ఫనీక్ష (8 నెలలు), పండూరి ఇముగ్ధ శ్రీ (5 నెలలు) అనే ముగ్గురు చిన్నారులకు విజయవంతంగా హార్ట్ సర్జరీలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఫౌండేషన్ అధికారికంగా ట్వీట్ చేసింది.
చిన్నారుల హృద్రోగాల చికిత్సకు భారీ ఖర్చులు అవసరం. సామాన్య కుటుంబాలకు ఇది భారంగా మారుతుంది. అలాంటి సమయంలో ఎంబీ ఫౌండేషన్ చేస్తున్న సహాయం అమూల్యమైనది. ప్రతి చిన్నారి పట్ల చూపుతున్న శ్రద్ధ, సేవా ధ్యేయాన్ని సామాజిక మాధ్యమాలు ప్రశంసిస్తున్నాయి.
ఇప్పటివరకు మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా 4,500కి పైగా గుండె శస్త్రచికిత్సలు జరగడం గర్వకారణం. ఈ సంఖ్య ప్రతి ఒక్కరికి మహేశ్ చేసిన సహాయం స్థాయిని తెలియజేస్తుంది. సమాజానికి తాను చేస్తున్న సేవలతో మహేశ్ బాబు అభిమానులకు మాత్రమే కాక, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.







