Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇవ్వాల్సిన కీలక తీర్పు మరోసారి వాయిదా పడింది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, దాని విచారణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు తుది తీర్పు వెలువడాల్సి ఉండగా, ధర్మాసనం అనూహ్యంగా విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.
దీంతో ఈ కేసుపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ శాంతికుమారి/జోషి తదితరులు కమిషన్ నివేదికను సవాల్ చేసిన విషయం తెలిసిందే. గత కొన్నినెలలుగా ఈ పిటిషన్లపై విస్తృత వాదనలు జరిగాయి.
ఈ కేసులో మార్చి 12న వాదనలు పూర్తికావడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే నేడు తీర్పు వస్తుందని అందరూ భావించిన సమయంలో, కోర్టు మరో తేదీకి వాయిదా వేయడం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నిబంధనలు పాటించలేదని, ముఖ్యంగా 8(b), 8(c) నోటీసులు సక్రమంగా ఇవ్వలేదని, సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం కల్పించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఎలాంటి సమగ్ర విచారణ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ముందుగానే ఒక నిర్ణయానికి రావడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజా ప్రయోజనాల రక్షణ కోసమే పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేశామని వాదించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నిర్మాణ, ఆర్థిక, పరిపాలనా అంశాలను వెలికి తీయడానికే ఈ విచారణ చేపట్టినట్లు తెలిపింది.
ఇప్పుడు హైకోర్టు తుది తీర్పు ఏ దిశగా వస్తుందన్నదే ప్రధాన ఆసక్తిగా మారింది. ఈ కేసు ఫలితం తెలంగాణ రాజకీయాలపై, ముఖ్యంగా కాళేశ్వరం అంశంపై భవిష్యత్ చర్చలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.








