Indian Navy: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్కు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోకుండా ఉండేందుకు భారత నౌకాదళం కీలక చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ ఊర్జా సురక్షా’ పేరుతో ప్రత్యేక మిషన్ ప్రారంభించి హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు భద్రత కల్పిస్తోంది.
సాధారణంగా సౌదీ అరేబియాలోని రాస్ తనురా వంటి పోర్టుల నుంచి బయలుదేరే నౌకలు పర్షియన్ గల్ఫ్ దాటి హర్మూజ్ జలసంధి చేరుతాయి. అయితే ప్రస్తుత యుద్ధ వాతావరణం కారణంగా అక్కడ వందల సంఖ్యలో నౌకలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో భారత నేవీ ఐదు యుద్ధ నౌకలను మోహరించి, చమురు మరియు గ్యాస్ ట్యాంకర్లను సురక్షితంగా ఎస్కార్ట్ చేస్తోంది. ఇటీవల ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ వంటి ట్యాంకర్లు నేవీ సహాయంతో అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి భారత్ వైపు ప్రయాణం ప్రారంభించాయి.
ముందుగా ‘శివాలిక్’, ‘నందాదేవి’ వంటి నౌకలు కూడా విజయవంతంగా దేశానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మరో 22 నౌకలు ప్రయాణానికి సిద్ధంగా ఉండగా, వీటిలో ఎక్కువ భాగం ఎల్పీజీ, ఎల్ఎన్జీ, క్రూడ్ ఆయిల్ను తీసుకువస్తున్నవే కావడం గమనార్హం.
ఇక హర్మూజ్ సమీపంలో సీమైన్స్ ముప్పు పెరిగిన నేపథ్యంలో భారత నౌకాదళం ప్రత్యేక హైడ్రోగ్రాఫిక్ చార్ట్లను సిద్ధం చేస్తోంది. నిఘా నౌకల సహాయంతో సముద్ర గర్భాన్ని స్కాన్ చేసి సురక్షిత మార్గాలను గుర్తిస్తోంది. ఈ మార్గాల ద్వారా నౌకలను ప్రమాదం లేకుండా దాటించేలా చర్యలు చేపడుతోంది.
మరోవైపు హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ఫీజులు విధిస్తామన్న వార్తలపై ఇరాన్ స్పందిస్తూ వాటిని ఖండించింది. అయినప్పటికీ భద్రత పేరుతో ఛార్జీలు వసూలు చేసే అవకాశంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ ఊర్జా సురక్షా’ దేశ ఇంధన భద్రతకు కీలకంగా మారింది.








