Hyderabad Model Corridor: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ పెరిగిపోయి జనం నానా తిప్పలు పడుతున్నారు.ఈ నేపథ్యంలో దానికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
నగరంలో కోటికి పైగా జనాభా నివసిస్తుండటంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి అవకాశాల కోసం లక్షలాది మంది హైదరాబాద్కు తరలివస్తుండటంతో రహదారులపై రద్దీ తీవ్రంగా మారింది.
ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించగా, తాజాగా మరో భారీ రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మూసీ నది పరివాహక ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో అక్కడ ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీనికి పరిష్కారంగా మూసీ నది వెంట 120 అడుగుల వెడల్పుతో భారీ మోడల్ కారిడార్ రోడ్డు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది.
also read:Jr NTR Dragon | డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. జూనియర్ ఎన్టీఆర్కు స్వల్ప అనారోగ్యం
అంబర్పేటలోని పటేల్ నగర్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు ఈ రోడ్డును రెండు దశల్లో నిర్మించనున్నారు.
మొదటి దశలో ఎస్టీపీ నుంచి ఉప్పల్ భగాయత్ డీమార్ట్ వరకు 2.7 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. ఇందుకు రూ.160 కోట్ల వ్యయం అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 22న జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే అంబర్పేట, రామంతపూర్, గోల్నాక ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ఉప్పల్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్లో నిలిచే అవసరం ఉండదు. మలక్పేట, ముసారాంబాగ్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల వాసులు, హైదరాబాద్–వరంగల్ హైవే వైపు వెళ్లే వాహనదారులకు కూడా ప్రయోజనం కలగనుంది.
రామంతపూర్ కేసీఆర్ నగర్ వద్ద వంతెన నిర్మాణంతో పాటు, రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్తో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా మూసీ పరివాహక ప్రాంతాలు అక్రమ కబ్జాల నుంచి రక్షణ పొందనున్నాయి.
