ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ ప్రధాన చోదకశక్తిగా మారుతోందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన సోషల్ మీడియా పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) స్పందిస్తూ, మస్క్ షేర్ చేసిన గణాంకాలు భారత్ వేగవంతమైన అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రపంచ జీడీపీ(GDP growth) వృద్ధిలో చైనా 26 శాతం వాటాతో ముందుండగా, భారత్ 17 శాతం, అమెరికా 9.9 శాతం వాటాను కలిగి ఉన్నట్లు ఆమె తెలిపారు. మొత్తం ప్రపంచ వృద్ధిలో 43 శాతం వాటా కేవలం చైనా, భారత్ ఆర్థిక వ్యవస్థల నుంచే వస్తోందని వివరించారు.
భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నదనడానికి ఇవి స్పష్టమైన ఉదాహరణలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలపై సీతారామన్ తీవ్ర విమర్శలు చేశారు.
దేశం వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే, కొందరు ప్రతిపక్ష నేతలు విదేశాల్లో భారత్ ఆర్థిక పరిస్థితులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్ త్వరలోనే చైనాను కూడా దాటి ముందుకు వెళ్లే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. విదేశీ పర్యటనల్లో రాహుల్ గాంధీ భారత్ను కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు. గతంలో భారత్ను “మృత ఆర్థిక వ్యవస్థ”గా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తూ, బాధ్యత గల నాయకుడిగా దేశ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
ALSO READ:Trump Crypto Deal | క్రిప్టో మార్కెట్లో ట్రంప్ ప్రభావం.. యూఏఈతో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ డీల్
