అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అత్యున్నత వ్యవసాయం చేసేందుకు దోహదపడే అంశాలను సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించడం జరిగింది అన్నారు. సైన్స్ ఫెయిర్ ముఖ్య ఉద్దేశ్యము కేవలం అంశాలను డిస్ప్లే చేయడమే కాదు వాటిని ప్రయోగాత్మకంగా నిరూపించగలిగే స్థితిలో ఉండాలని, ఇతర దేశాల్లో వలె ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సాధించాలని, భారతదేశానికి భవిష్యత్తు పిల్లలు కాబట్టి వారికి సెల్ఫ్ కాన్ఫూ తో పాటు విజ్ఞానాన్ని అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
వ్యవసాయం అంటేనే సైన్స్ అని సైన్స్ ద్వారా ఏదైనా సాధించవచ్చునని, వ్యవసాయాన్ని తక్కువగా చూడవద్దని చాలా గౌరవప్రదమైనదని వివరించారు.
ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ తాను ఒక ప్రజా ప్రతినిధిగా కాకుండా ఒక ఉపాధ్యాయుడుగా సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్నానని. మూడు రోజులపాటు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కు ప్రతి ఒక్కరు ఎంతగానో సహకరించారని తెలిపారు. భవిష్యత్తు విద్యార్థి లోకానిదని, విద్యార్థులు ఒక ఆలోచనతో, ఆశయంతో ముందుకు వెళతారో అప్పుడే గ్రామాల యొక్క అభివృద్ధి మౌలిక స్వరూపం మారుతుందన్నారు. మొక్క ఏ విధంగా అయితే ఆటంకాలు ఎదుర్కొంటూ పైకి వస్తుందో విద్యార్థులు కూడా అదే లక్ష్యంతో ముందుకు రావాలన్నారు.
జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎస్పీ రోహిత్ రాజు, డిసిసిబి చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు. డీఈవో వెంకటేశ్వర చారి, జిల్లా సైన్స్ అధికారి చలపతి రాజు పాల్గొన్నారు.
