Atal Pension Yojana: అసంఘటిత రంగ కార్మికులకు శుభవార్తగా, అటల్ పెన్షన్ యోజనను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదవీ విరమణ అనంతరం హామీ ఇవ్వబడిన నెలవారీ పెన్షన్ అందించే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా లక్షలాది మంది పేద కార్మికులకు వృద్ధాప్య ఆదాయ భద్రత లభించనుంది.
ఈ పథకం కోసం ప్రచార, అభివృద్ధి కార్యకలాపాలు, గ్యాప్ ఫండింగ్కు కూడా ప్రభుత్వ మద్దతు కొనసాగనుంది.
2015 మే 9న ప్రారంభమైన అటల్ పెన్షన్ యోజన అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పిస్తోంది. 2026 జనవరి 19 నాటికి ఈ పథకం కింద 8.66 కోట్లకు పైగా మంది చందాదారులు నమోదు అయ్యారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ALSO READ:Varanasi Release Date: రిలీజ్ డేట్ ట్వీట్తో సర్ప్రైజ్ ఇచ్చిన ‘వారణాసి’ టీమ్
ఈ పథకం ద్వారా 60 ఏళ్ల వయస్సు పూర్తైన తర్వాత నెలకు కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. ఇది కాంట్రిబ్యూషన్ ఆధారిత పథకం కావడంతో, చందాదారుల వయస్సును బట్టి నెలవారీ చెల్లింపులు మారుతాయి. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.
ఉదాహరణకు, 18 ఏళ్ల వయస్సులో చేరిన వ్యక్తి నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు చెల్లిస్తే, 60 ఏళ్ల తర్వాత గరిష్టంగా రూ.5,000 పెన్షన్ పొందవచ్చు.
భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరితే నెలకు రూ.420 చెల్లించి కలిపి రూ.10,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది.
ఈ పథకంలో ఆన్లైన్ ద్వారా లేదా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతా తెరవవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరి. నేషనల్ పెన్షన్ స్కీం పరిధిలో ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కారు.
