Amaravathi Farmers: రాజధాని అమరావతి రైతులకు సీఆర్డీఏ భారీ శుభవార్త అందించింది. రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ప్లాట్ల కేటాయింపును చేపట్టనున్నట్లు ప్రకటించింది. రైతులు కోరుకున్న ప్రాంతాల్లో ఈ-లాటరీ విధానం ద్వారా స్థలాలను కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ నెల 29వ తేదీన ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు సీఆర్డీఏ వర్గాలు వెల్లడించాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులకు మళ్లీ ఊపొచ్చింది. ఈ క్రమంలో దశలవారీగా రైతులకు ప్లాట్లు అందజేస్తూ వస్తోంది. ఇప్పటికే వేలాది మంది రైతులు ఈ ప్రక్రియ ద్వారా లబ్ధి పొందారు. తాజాగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుకు ముహూర్తం ఫిక్స్ చేయడం గమనార్హం.
ఈ ప్లాట్లను పూర్తిగా పారదర్శకంగా ఈ-లాటరీ విధానంలో కేటాయిస్తున్నట్లు సీఆర్డీఏ స్పష్టం చేసింది. వాయిదా పడిన ప్రక్రియను ఈ నెల 29న పూర్తి చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. అలాగే ఉండవల్లి జరీబు కోసం భూములిచ్చిన రైతులకు జనవరి 30న ప్లాట్లు కేటాయించే అవకాశముందని సమాచారం.
ప్లాట్ల కేటాయింపు అనంతరం రైతులకు ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అందించనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు మొత్తం 30 వేల మందికిపైగా రైతులకు 69,421 స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. త్వరలోనే మిగిలిన రైతులందరికీ ప్లాట్లు కేటాయించి ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు.
ALSO READ:Balakot Airstrikes | బాలాకోట్ వైమానిక దాడుల్లో మిగ్-21 వినియోగంపై మాజీ చీఫ్ వివరణ
