Telangana Budget 2026: తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్ల భారీ వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ సామాజిక, ఆర్థిక న్యాయం ప్రతి పౌరుడికి అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు, మార్గదర్శకత్వాన్ని అనుసరించి పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో శాసనమండలిలో బడ్జెట్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ బడ్జెట్లో విద్య, వ్యవసాయం, విద్యుత్, పౌరసరఫరాలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే ఐటీఐలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.2,000 ఉపకార వేతనం అందించనున్నట్లు వెల్లడించింది. యువత నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల పోషకాహారంపై దృష్టి పెట్టిన నిర్ణయాలుగా ఇవి నిలిచాయి.
శాఖల వారీగా చూస్తే వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ ఈ బడ్జెట్ రూపొందించినట్లు స్పష్టమవుతోంది. రైతులు, విద్యార్థులు, బలహీన వర్గాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే లక్ష్యంగా ఈ కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం భావిస్తోంది.







