73 లక్షల మొబైల్ కనెక్షన్లను రీవెరిఫికేషన్లో విఫలమై టెలికం కంపెనీలు రద్దు చేశాయి: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌ల‌మైన 73 ల‌క్ష‌ల మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను టెలికం కంపెనీలు ర‌ద్దు చేసిన‌ట్లు బుధ‌వారం లోక్‌స‌భ‌లో కేంద్ర స‌హాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. ఆయా మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను రీవెరిఫై చేయాలాని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్ (డాట్‌) టెల్కోల‌ను ఆదేశించింది. 

వివ‌రాల ధృవీక‌ర‌ణలో విఫ‌ల‌మైన కంపెనీలు, కనెక్ష‌న్ల‌ను ర‌ద్దు చేశాయి. న‌కిలీ ఐడీలు లేదా అడ్ర‌స్‌ల‌తో త‌ప్పుడు కనెక్ష‌న్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్య‌వ‌స్థ‌ని రూపొందించిన‌ట్లు ఈ సంద‌ర్భంగా కేంద్రం వెల్ల‌డించింది. 

“ఇప్పటి వరకు 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్‌లను డాట్ గుర్తించింది. వాటిలో 73 లక్షల మొబైల్ కనెక్షన్‌లు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల రీవెరిఫికేషన్‌లో విఫలం కావ‌డంతో డిస్‌కనెక్ట్ చేశాం” అని మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియ‌జేశారు.

అలాగే నకిలీ రుజువుల‌తో సిమ్‌లను యాక్టివేట్ చేయడానికి సంబంధించిన ప్రశ్నకు కూడా మంత్రి సమాధానమిచ్చారు. “పాన్-ఇండియా ప్రాతిపదికన అన్ని ఆపరేటర్లలో ఒక వ్యక్తి కలిగి ఉండే మొబైల్ కనెక్షన్ల నిర్ణీత పరిమితిని మించి దాదాపు 16 లక్షల మంది చందాదారులు కలిగి ఉన్న సుమారు 1.92 కోట్ల మొబైల్ కనెక్షన్‌లను డాట్‌ గుర్తించింది. వీటిలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు దాదాపు 66 లక్షల మొబైల్ కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేశాయి. తద్వారా ఈ 16 లక్షల మంది చందాదారులకు మొబైల్ కనెక్షన్‌లను నిర్ణీత పరిమితిలోపు తీసుకురావ‌డం జ‌రిగింది” అని మంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *