బిజినెస్ డెస్క్: ఈ ఏడాది ఆరంభంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు క్రమంగా దిగొస్తూ కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. ప్రధానంగా పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన ద్రవ్యోల్బణ భయాలే ఈ పతనానికి కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సోమవారం నాటి ట్రేడింగ్లో అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ఔన్సు ధర ఏకంగా 4,138 డాలర్లకు దిగొచ్చి.. నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. ఇలా స్పాట్ గోల్డ్ ధర తగ్గడం వరుసగా ఇది తొమ్మిదో రోజు కావడం గమనార్హం. వారం ఆరంభంలో 5000 డాలర్ల పైనే ఉన్న పసిడి ధర, ఇప్పుడు భారీగా క్షీణించింది. మరోవైపు వెండి కూడా 62.47 డాలర్లకు పతనమైంది. దేశీయ మార్కెట్లోనూ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో 10 గ్రాముల బంగారం ధర 9.8 శాతం తగ్గి రూ.1,30,300 వద్ద కొనసాగుతుండగా, మే ఫ్యూచర్స్లో కిలో వెండి ధర 10.97 శాతం పతనమై రూ.2.01 లక్షలుగా ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్లో నేటి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరమైన హైదరాబాద్లో సోమవారం 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,36,510 వద్ద కొనసాగుతోంది. అలాగే కిలో వెండి ధర రూ.2.09 లక్షలు పలుకుతోంది.
కారణాలు ఏంటి?
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణం పెచ్చుమీరుతుందన్న ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లలో వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించొచ్చనే అంచనాలతో డాలర్ బలపడటం పసిడికి ప్రతికూలంగా మారింది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ (యూఎస్ ఫెడ్), బ్యాంక్ ఆఫ్ జపాన్ వంటి ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ కీలక వడ్డీ రేట్లను యథాతధంగా కొనసాగించడం కూడా బంగారం, వెండి ధరల పతనానికి ప్రధాన కారణమని బులియన్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.








