Chicken Shops: తెలంగాణలో చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్ ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను ఏప్రిల్ 1 నుంచి బంద్ చేయాలని వ్యాపారులు నిర్ణయించడం సంచలనం రేపుతోంది. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న తక్కువ లాభాల మార్జిన్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార సంఘాలు వెల్లడించాయి.
ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో బంద్కు సంబంధించిన పోస్టర్లు కనిపించడం ప్రారంభమైంది.
వ్యాపారుల ప్రకారం, కోళ్ల మేత ఖర్చులు, రవాణా వ్యయాలు పెరుగుతున్నప్పటికీ తమకు ఇచ్చే కమీషన్ మాత్రం తగ్గిపోవడంతో వ్యాపారం నష్టాల్లోకి వెళ్లిందని అంటున్నారు. రోజువారీ ఖర్చులు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ నేపథ్యంలో బంద్ తప్ప మరో మార్గం లేదని పేర్కొంటున్నారు.
తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ సమస్య పరిష్కారం అయ్యే వరకు షాపులు తెరవబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలతో చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ బంద్ ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు చికెన్ సరఫరా నిలిచిపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.360 నుంచి రూ.370 వరకు ఉంది. ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని అంచనా.







