R Madhavan: చాక్లెట్ బాయ్గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆర్. మాధవన్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. భాషా, ప్రాంత భేదాలు లేకుండా దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకున్న ఆయన ప్రతిభకు ఇది గుర్తింపుగా నిలిచింది.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అలైపాయుతే’ (తెలుగులో ‘సఖి’) చిత్రంతో యువతలో కలల రాకుమారుడిగా మారిన మాధవన్, ఆ ఇమేజ్లోనే నిలిచిపోకుండా విభిన్న పాత్రలతో తన నటనా పరిధిని విస్తరించారు. ‘రంగ్ దే బసంతి’, ‘3 ఇడియట్స్’, ‘తనూ వెడ్స్ మను’, ‘విక్రమ్ వేద’ వంటి చిత్రాల్లో రొమాంటిక్ నుంచి ఇంటెన్స్ పాత్రల వరకు అద్భుతంగా పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటిన మాధవన్, భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితకథ ఆధారంగా రూపొందించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ చిత్రంతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.
జార్ఖండ్లోని జంషెడ్పూర్లో తమిళ కుటుంబంలో జన్మించిన మాధవన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే కెనడాకు భారత సాంస్కృతిక రాయబారిగా ఎంపిక కావడం విశేషం.
సినిమాల్లోకి రాకముందు టెలివిజన్ రంగంలో సుమారు 1800 ఎపిసోడ్లలో నటించి అనుభవం సంపాదించారు. ఈ ప్రయాణమే ఆయనను పద్మశ్రీ స్థాయికి చేర్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ:Jagga Reddy | సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తరలిస్తే ఊరుకోను
