Meeseva Service: రాష్ట్ర ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా అందించే పౌర సేవలపై వినియోగ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
పెంచిన వినియోగ ఛార్జీలతో పాటు 18 శాతం జీఎస్టీ కూడా విధించడంతో, ప్రజలు మరియు విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. కేటగిరీ-ఏ సేవల ఛార్జీని రూ.35 నుంచి రూ.62కు, కేటగిరీ-బీ సేవలను రూ.45 నుంచి రూ.80కు పెంచారు. పేరుకి 50 శాతం పెంపు చేసినా, జీఎస్టీతో కలిపి వాస్తవ భారం 77 నుంచి 78 శాతం వరకు పెరిగినట్టవుతోంది.
మీసేవలో కేటగిరీ-ఏ సేవలు అంటే అదనపు పరిశీలన అవసరం లేకుండా అందించే సేవలు. కేటగిరీ-బీ సేవలు మాత్రం సంబంధిత శాఖ విచారణ, ధ్రువీకరణ తర్వాత మంజూరు అవుతాయి. ఇప్పటివరకు వినియోగ ఛార్జీ చెల్లిస్తే సరిపోతుండగా, ఇప్పుడు అదనపు పత్రాల స్కానింగ్, ప్రింటింగ్పైనా భారం పెరిగింది.
గతంలో నాలుగు పేజీలకు మించి ప్రతి పేజీకి రూ.2 వసూలు చేసేవారు. ఇకపై అదే రుసుము రూ.2.50గా నిర్ణయించారు. ఉదాహరణకు, కొత్త కుల ధ్రువీకరణ పత్రం కోసం గతంలో రూ.45 చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు 50 శాతం పెంపు, దానిపై జీఎస్టీ కలిపి దాదాపు రూ.80 చెల్లించాల్సి వస్తోంది.
మరోవైపు, మీసేవ నిర్వాహకులకు లభించే కమీషన్ను కూడా ప్రభుత్వం గణనీయంగా పెంచింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ పెంపు చోటుచేసుకుంది. కేటగిరీ-ఏ సేవలపై గతంలో రూ.13 కమీషన్ వస్తుండగా, ఇప్పుడు అది రూ.40.34కు చేరింది. కేటగిరీ-బీ సేవలపై ప్రస్తుతం రూ.52.10 వరకు కమీషన్ లభించనుంది.
అలాగే ఈ-పాస్, ఆధార్ ధ్రువీకరణ వంటి సేవల ఛార్జీలను కూడా ప్రభుత్వం పెంచింది. ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల కంటే అధికంగా వసూలు చేస్తే 1100, 18004251110 నంబర్లకు ఫిర్యాదు చేయాలని, లేదా meesevasupport@telangana.gov.in కు మెయిల్ పంపాలని సిటిజన్ చార్టర్లో సూచించింది.








