అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కొత్త చరిత్ర లిఖించబడింది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద ఏర్పాటు చేయనున్న ‘ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్’కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వారు ప్రసంగించారు.
2028 నాటికి ఉత్పత్తి ప్రారంభం: సీఎం చంద్రబాబు ఇది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ కాదని, ఒక ‘స్టీల్ సిటీ’కి పునాది అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఏపీలో ఉన్నన్ని వనరులు దేశంలో ఎక్కడా లేవని, విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే ఇది అతిపెద్ద పరిశ్రమగా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “భారత్లోనే అతిపెద్ద స్టీల్ప్లాంట్ నక్కపల్లిలో 5,465 ఎకరాల్లో ఏర్పాటు కాబోతోంది. దీని ద్వారా లక్ష మందికి ఉపాధి లభిస్తుంది. 2028 డిసెంబర్ నాటికి ఇక్కడ నుంచి స్టీల్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు ఏపీ అడుగులు వేస్తోంది. ఏ పని తలపెట్టినా బేషరతుగా మద్దతిస్తున్న పవన్ కల్యాణ్కు, ఈ ప్రాజెక్టు కోసం ప్రణాళికాబద్ధంగా పని చేసిన మంత్రి లోకేశ్కు అభినందనలు.” అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, విశాఖను రేర్ ఎర్త్ మినరల్స్ హబ్గా, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
చంద్రబాబు వల్లే పెట్టుబడులు సాధ్యం: పవన్ కల్యాణ్ ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి రావడం తమలో ఎంతో విశ్వాసాన్ని పెంచిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. లక్షలాది మందికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించడం సంతోషకరమన్నారు. “పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉన్న నేత కావాలి. లక్ష్మీ మిత్తల్ను ఒప్పించి ఇంత భారీ ప్రాజెక్టును తీసుకురావడం రాజకీయ ధురంధరుడైన చంద్రబాబు వల్లే సాధ్యమైంది. దేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇది.” అని పవన్ కొనియాడారు.
ఏపీ శరవేగంగా దూసుకుపోతోంది: కేంద్ర మంత్రి కుమారస్వామి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీ అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతోందని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తోందన్నారు. మంత్రి నారా లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్నారని ప్రశంసించారు. అలాగే, కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమకు సైతం ఆర్థికంగా అండగా నిలుస్తోందని, అక్కడ ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని కుమారస్వామి స్పష్టం చేశారు.








