Sabarimala Case: శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కు కొల్లాం విజిలెన్స్ కోర్టు అనుమతి మంజూరు చేసింది.
కేసుకు సంబంధించిన అన్ని కీలక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సంబంధిత దస్త్రాలను ఈడీకి అప్పగించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ)ను కోర్టు ఆదేశించింది.
ALSO READ:Congress | అదృష్టం ఉంటే మంత్రి పదవి వరిస్తుంది..రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
శబరిమల ఆలయంలోని విగ్రహాలకు తాపడం చేసిన బంగారం బరువులో వ్యత్యాసం వెలుగులోకి రావడంతో ఈ కేసు అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇందులో కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి గతంలో శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేశాడు. అతని వెనుక ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
దేవస్థానం మాన్యువల్ ఉల్లంఘనలపై పలు సందేహాలు ఉన్నాయని కేరళ హైకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు ఎస్ఐటీ దర్యాప్తు కొనసాగుతుండగా, తాజాగా మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరిపేందుకు ఈడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
